ఆర్బీకేల ద్వారా అన్నదాత ముంగిట్లో పశు వైద్యసేవలు.
హెల్త్ కార్డులతోపాటు గ్రామస్థాయిలో శిబిరాలు.
సర్టిఫై చేసిన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా.. పశువులు, మేకలు, గొర్రెల పెంపకందారుల కోసం పశువిజ్ఞాన బడులు.
పాడిరైతుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లు.. మూగ జీవాల కోసం వైఎస్సార్ సంచార పశు వైద్య సేవలు.
108 అంబులెన్స్ల తరహాలో పశువులకు వైద్యసేవలు దేశంలోనే తొలిసారి.
Veterinary Services Farmers Through Rythu Bharosa Centres
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిందని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవలందించడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మినరల్ మిక్చర్, చాప్ కట్టర్స్.. ఏది కావాలన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
108 అంబులెన్స్ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్లను సిద్ధం చేశారు.
వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు.
ఇప్పటివరకు కాల్ సెంటర్కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్ చొప్పున 3.90 లక్షల కాల్స్ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది.
మూగ జీవులపై మమకారం..
వైఎస్సార్ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.
రెండున్నరేళ్లలో సేవలిలా..
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు.
ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు.
Leave a Reply